Posted by: nagamurali | June 29, 2009

మల్లినాథ సూరి

(చిన్నప్పుడు బాలజ్యోతిలో చదివిన మహీధర నళినీమోహన్ గారి కథ ఆధారంగా.)

అనగా అనగా ఒక మహా పండితుడు. ఆయనకొక పుత్రుడు. అతను అక్షరాలా పండిత పుత్రుడు. పేరు మల్లినాథుడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తండ్రి గారాబంగా పెంచాడు. దాంతో మల్లినాథుడు చదువుకి మొండికేసి అక్షరమ్ముక్క కూడా నేర్చుకోకుండా అల్లరి చిల్లరగా పెరిగాడు. పెళ్ళీడు వచ్చింది. వేరే ఊరిలోని పండిత కుటుంబంలోని పిల్లని తెచ్చి పెళ్ళి చేశారు. తండ్రిగారి కీర్తి తప్ప కుమారుడి ప్రతిభ గురించి తెలియక ఆ పిల్ల కుటుంబం పెళ్ళికి ఒప్పుకుంది. మధ్యలో మసిపూసి మారేడుకాయ చేసే పేరయ్యలు ఉండనే ఉంటారుగా.

పెళ్ళి తంతులు పూర్తయ్యాకా అత్తవారి ఇంటికి వెళ్ళాడు మల్లినాథుడు. వెళ్ళే ముందే కొడుక్కి కొన్నిజాగ్రత్తలు చెప్పాడు తండ్రి. ‘ఒరే అబ్బాయీ, మీ మామగారూ, బావ మరుదులూ అంతా మంచి పండితులు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ గ్రంథాలూ అవీ చూపించి గోష్టి మొదలుపెడతారు. సాధ్యమైనంతవరకూ తప్పించుకో. ఏదైనా పుస్తకం చూపిస్తే, “గ్రంథకర్త ఎవరూ? ఈ భాష్యకారుడితో మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి”, ఇలా ఏదో దబాయించు సుమా’ అని సలహా ఇచ్చాడు.

మనవాడికి అత్తవారి ఇంటిలో రాచమర్యాదలు జరుగుతున్నాయి. అంత పెద్ద పండితుడి కొడుకు వచ్చాడని ఊరు ఊరంతా వచ్చి చూసి వెడుతోంది. మల్లినాథుడి భార్యకి గర్వంగా ఉంది. మల్లినాథుడు ఏవో పనులు కల్పించుకుని చర్చాగోష్టుల ప్రసక్తి రానియ్యకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సాప్ట్ వేర్ ఇంజనీరుకి పెళ్ళయి, సాప్ట్ వేర్లో పని  చేస్తున్న బావమరుదులు ఉంటే ఊరుకుంటారా? ‘బావా, జావా’ అంటూ ఏవో కబుర్లు మొదలుపెట్టరూ! అలాగే మల్లినాథుణ్ణి కూడా బలవంతాన అతని బావమరుదులు వాళ్ళ పుస్తకాల గదిలోకి లాక్కెళ్ళి వాళ్ళ పుస్తకాలు అన్నీ చూపిస్తున్నారు. మనవాడు, ‘ఇలాంటి చచ్చు పుస్తకాలు మేం చాలా చూశాం లేమ్మా’ అన్నట్టుగా పోజిచ్చి ఏదో దబాయిస్తున్నాడు. వాళ్ళావిడ కూడా సరదాపడి వచ్చి అక్కడే కూర్చుని అంతా వింటోంది.

మల్లినాథుడు వాళ్ళ అలమారులో ఏదో దుక్కలాటి పుస్తకం కనపడితే దాన్ని తీసి, ‘ఇది ఏ గ్రంథం?’ అని అడిగాడు. ‘అది అలిఖితం’ అన్నారు బావమరుదులు. ‘అలాగా, ఎవరు రాశారు?’ అన్నాడు. వాళ్ళు గొల్లున నవ్వారు. ఇతనికి ఏమీ తెలియదని వాళ్ళకీ, అతని భార్యకీ అనుమానం వచ్చింది.

మర్నాడు పొద్దున్న అతని మామగారు పిలిచి, ‘నాయనా, పూజకి వేళవుతోంది. ఏమైనా పూలు తీసుకురా’ అని పంపించారు. (నేనైతే, ‘అల్లుడికి పని చెప్పడమేమిటండీ, ఠాట్’ అని ఎగిరేసి సైలెంటుగా ఇంటికొచ్చేద్దును.) పాపం ఆ వెర్రివాడు ఊళ్ళోకి పోయి ఎదురుగా ఎర్రటి పూల చెట్టు ఒకటి కనబడితే, దాన్ని ఎక్కి బోలెడన్ని పూలు కోసుకుని తీసుకువచ్చాడు. తీరా చూస్తే అవి మోదుగ చెట్టు పూలు. పూజలకి పనికిరావు. బావగారి నిర్వాకం చూసి బావమరుదులు పడీ, పడీ నవ్వారు. మామగారు తెల్లబోయాడు.

అప్పుడు మల్లినాథుడి భార్య (ఆవిడ కూడా మంచి జావా ప్రోగ్రామరే) మొగుణ్ణి చూసి ఒక శ్లోకం చెప్పిందిట.

రూప యౌవన సంపన్నం

గుణ శీల సమన్వితం

విద్యాహీనం న శోభన్తే

పాలాశ కుసుమం యథా||

ఒక మనిషి మంచి అందగాడు కావచ్చు, వయసులో ఉండి ఉండవచ్చు. మంచి గుణాలూ, సత్ప్రవర్తనా కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ అతనికి జావా రాకపోతే ఆ గుణాలేమీ శోభించవు- మోదుగ చెట్టు పువ్వుల్లాగా. (మోదుగ చెట్టు పూలు కూడా ఎర్రగా బాగుంటాయి, కానీ వాసన ఉండదుట.)

దాంతో మల్లినాథుడికి అహం దెబ్బతింది. వెంటనే అదే క్షణంలో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళడం, వెళ్ళడం నవద్వీపం వెళ్ళిపోయాడు. పన్నెండేళ్ళు ఇల్లూ, ఒళ్ళూ మర్చిపోయి కఠోర శ్రమ చేసి మహా సంస్కృత పండితుడయ్యాడు. గెడ్డాలు పెరిగిపోయి సన్యాసి రూపం వచ్చింది. చదువు పూర్తయ్యాకా మళ్ళీ అత్తవారి ఊరు వెళ్ళాడు. తిన్నగా అత్తవారి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు.

ఎవరో మహా తేజస్వి మన ఇంటికి పిలకుండానే వచ్చాడని సంబరపడి అతని అత్తా, మామగారూ ఇంట్లోకి రమ్మని సపర్యలు చేసి భోజనానికి కూర్చోమన్నారు. అతని భార్యే వడ్డన మొదలు పెట్టింది. పాపం శోకం మూర్తీభవించినట్టుగా ఉందామె. పరధ్యానంగా ఉంది. చారు వడ్డించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు మల్లినాథుడు. వెంటనే ఒక శ్లోకం చెప్పాడు -

చారు చారు సమాయుక్తం

హింగు జీర సమన్వితం

లవణ హీనం న శోభన్తే

పాలాశ కుసుమం యథా ||

‘చారు చాలా అందంగా ఇంగువ, జీలకర్రలతో కలిపి చెయ్యబడింది. కానీ  ఉప్పు లేకుండా అవేవీ శోభించవు – మోదుగచెట్టు పువ్వుల్లాగే’ అని ఆ శ్లోకానికి అర్థం. మల్లినాథుడి భార్యకి దిమ్మతిరిగింది. తేరిపార చూసి, గెడ్డం వెనకాల ఉన్నది తన భర్తే అని గ్రహించింది. ఆవిడ ఆనందానికి అవధుల్లేవు.

మల్లినాథుడు మన తెలుగువాడే. సంస్కృత మహాకావ్యాలకి ఆయన రాసిన వ్యాఖ్యలు జగత్ప్రసిద్ధాలు. ‘మాఘే, మేఘే గతం వయ:’ అని ఆయన చెప్పుకున్నాడుట.  అంటే, మాఘ కావ్యానికీ, మేఘ కావ్యానికీ (మాఘుడు రాసిన శిశుపాలవధకీ, కాళిదాసు రాసిన మేఘసందేశానికీ) వ్యాఖ్య రాయడంలో తన వయస్సు అంతా అయిపోయిందని దాని భావం.

(కోలాచల మల్లినాథ సూరి వంశంలో పుట్టిన ఒకాయన్ని నా అదృష్టం కొద్దీ కలుసుకోగలిగాను. ఆయనా గొప్ప పండితుడే. తెలుగు భాషా, సాహిత్యాల్లో అంతర్జాలంలో ఆయన చేస్తున్న కృషి అందరికీ తెలిసినదే.)

నా బ్లాగు టపాలు ఇకపై కూడలి మెయిన్ పేజీలో కనిపించవు. సాహిత్యం పేజీలో మాత్రమే కనిపిస్తాయి.

ప్రవృద్ధమంద్రాంబుదధీరనాదః
కృష్ణార్ణవాభ్యర్ణచరైకహంసః
మందానిలాపూరకృతం దధానో
నిధ్వానమశ్రూయత పాంచజన్యః ||

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితం గురించి హైస్కూల్లో ఒక నాండిటేల్డ్ పాఠ్య పుస్తకం ఉండేది. అందులో చదివాను. ఆయనని చిన్నతనంలో గీతగోవిందంలోని ‘నిభృత నికుంజ గృహం’ అన్న పదం (సమాసం) చాలా ఆకర్షించిందిట. సంస్కృత కావ్యాలు చదివితే కొన్ని అందమైన పదాలూ, పదచిత్రాలూ మన మనస్సులో చెరగని ముద్రలు వేస్తాయి. కవులు ఆ పదాల కూర్పుని ఎలా చేశారో కదా అనిపిస్తుంది. అంతకన్నా అందంగా పదాల్ని సృష్టించడం, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యడం సాధ్యం కాదనిపిస్తుంది. అందుకే కదా ‘నానృషిః కురుతే కావ్యం’ అన్నది!!

ఇంక అసలు విషయానికొస్తే పైన చెప్పిన శ్లోకం చూడండి. అందులోని ‘కృష్ణార్ణవాభ్యర్ణ చరైక హంస’ అన్న సమాసం నాకు చాలా ఇష్టమైనది. మాఘకావ్యం మూడో సర్గలోది ఈ శ్లోకం. ఆ సమాసానికి అర్థం ఏమిటంటే, ‘కృష్ణుడు అనబడే సముద్రానికి దగ్గర్లో తిరుగాడుతూ ఉండే ఒకానొక హంస’ అని. శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యాన్ని వర్ణిస్తూ మాఘుడు చేసిన గొప్ప ఊహ ఇది. భావన చేసే కొద్దీ ఈ సమాసం, ఇందులోని అలంకారం, పదాల కూర్పు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుస్తుంది.

అర్థాలు చూడండి -

ప్రవృద్ధ మంద్ర అంబుద ధీర నాదః – వర్షాకాలంలో కనిపించే గొప్ప మేఘం యొక్క మంద్రమైన, గంభీరమైన ధ్వని కలిగినదీ

కృష్ణ అర్ణవ అభ్యర్ణ చర ఏక హంసః – శ్రీకృష్ణుడనే సముద్రానికి దగ్గరలో తిరుగాడుతూ ఉండే ఒకానొక హంస

పాంచజన్యః – (అయినట్టి) పాంచజన్యమనే శంఖం

మంద అనిల ఆపూరకృతం నిధ్వానం దధానః – మెల్లగా వీచే గాలి చేత పూరించబడుతున్న ధ్వనితో

అశ్రూయత – వినిపించెను.

కామేశ్వరరావు గారూ, ఈ శ్లోకానికి మీ తెలుగు అనువాదం కోసం ఎదురు చూస్తాను. అక్షరలక్షలు ఇవ్వలేను గానీ మనం కలుసుకున్నప్పుడు తప్పకుండా అక్షరానికో పకోడీయో, మరేదైనా మీకిష్టమైనదో సమర్పించుకుంటాను.

భైరవభట్ల కామేశ్వరరావు గారి సమాధానం, అనువాదం:

“అంతకన్నా అందంగా పదాల్ని సృష్టించడం, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యడం సాధ్యం కాదనిపిస్తుంది.”, అని కూడా నన్ను అనువాదించమన్నారే!
కొన్ని పద్యాలు అర్థ ప్రధానమైనవి ఉంటాయి. వాటిని అనువదించడం కొంత సులువు. మరికొన్ని శబ్ద ప్రథానమైనవి. వాటిని అనువదించడం అనవసరం. కొన్ని మాత్రం శబ్దార్థ సమప్రాధాన్యం కలిగినవి ఉంటాయి. వాటిని అనువదిస్తే బావుంటుందనిపిస్తుంది. కాని అనువదించడం చాలా కష్టం. ఈ శ్లోకం అలాంటిది! ఆ పదాలు, పదాల సంయోజనం, భావాన్ని ఎంతగానో ప్రకాశింపజేస్తున్నాయి!

“ప్రవృద్ధమంద్రాంబుదధీరనాదం” ఆ శ్లోకంలో వినిపిస్తోంది.

అయినా మనసు ఊరుకోదు కదా. ఏదో ప్రయత్నించాను.

ప్రావృడంబుద మంద్ర ధీరస్వనంబు
సెలగ, కృష్ణాంబునిధి వియత్తల విహార
హంస మందానిలోంభిత మగుచు దిశల
మ్రోగె నదె పాంచజన్యంబు మోహనంబు!
మ్రోగె నదె పాంచజన్యంబు మోక్షదంబు!

పరేతభర్తుర్మహిషో2మునా ధను
ర్విధాతుముత్ఖాత విషాణమండలః
హృతే2పి భారే మహతస్త్రపాభరాత్
ఉవాహ దుఃఖేన సదా నతం శిరః ||

సంస్కృతసాహిత్యంలో హాస్యం పాళ్ళు తక్కువ అని ఒక అభియోగం ఉంది. నాకు మాత్రం సున్నితమైన హాస్యం అడపాదడపా సంస్కృత కావ్యాల్లో కనిపిస్తూనే ఉంటుంది. పైన చెప్పిన శ్లోకం చూడండి. దాని అర్థం ఏమిటంటే -

ఒక మొనగాడున్నాడు. వాడికి యముడి దున్నపోతుని చూస్తే, దాని కొమ్ములతో విల్లు తయారు చేయించుకోవాలని కోరిక కలిగింది. అంతే, ఆ పళంగా దాని కొమ్ముల్ని పీకి తన కోరిక చెల్లించుకున్నాడు. పాపం ఆ దున్నపోతుకి తల మీద బరువు దిగి సుఖంగానే ఉంది గానీ, ఎంత అవమానం!! ‘యముడి మహిషపు లోహఘంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయ్’ అని జనాలు దాన్ని తల్చుకుని భయపడ్డం మానేసి నవ్వుకోడం మొదలెట్టారు. ఆ అవమాన భారం భరించలేనంతగా అనిపించసాగింది. సిగ్గుతోటీ, దుఃఖంతోటీ ఇంక తల పైకి ఎత్తడమే మానేసింది.

ఇంతకీ ఆ మొనగాడు ఎవరయ్యా అంటే, రావణాసురుడు. ఈ శ్లోకం మాఘకావ్యం (శిశుపాల వధం) మొదటి సర్గలోది. రావణుడి ‘లీలలు’ అన్నీ చాలా హాస్యంగా వర్ణిస్తాడు అందులో.

ఆగండాగండి, అర్థాలు వినకుండా పారిపోదామనే! అలా కుదరదు.

పరేత భర్త – ప్రేతాలకి అధిపతి, యముడు

పరేత భర్తుః మహిషః – యముడి మహిషం

అమునా – అతని చేత (రావణుని చేత)

ధనుః విధాతుం – ధనుస్సు తయారు చేసుకోడానికి

ఉత్ఖాత విషాణ మండలః – పెరుకబడిన కొమ్ముల సమూహం(జంట) కలిగినదై

భారే హృతే అపి – బరువు తొలగిపోయినప్పటికీ

మహతః త్రపా భరాత్ – గొప్పదైన సిగ్గు యొక్క బరువుచేత

దుఃఖేన – దుఃఖం చేత

సదా నతం శిరః – ఎల్లప్పుడూ వంచిన శిరస్సును

ఉవాహ – వహించెను.

అలాగే సముద్రుణ్ణి మూర్ఛరోగిగా అభివర్ణిస్తాడు మాఘుడు మూడో సర్గలో. దాని గురించి ఇక్కడ చూడండి.

ఈ శ్లోకానికి భైరవభట్ల కామేశ్వరరావు గారు చేసిన తెలుగు అనువాదం -

యముని దున్న కొమ్ము లా రావాణుడు బట్టి
విల్లు జేయనెంచి విరిచె నంత
దాని తలను బరువు తగ్గిపోయెను గాని
సిగ్గు బరువు మించి శిరసు వంచె||

Posted by: nagamurali | May 31, 2009

కర్రీ బేషింగ్

ఆస్ట్రేలియాలోభారతీయ విద్యార్థులమీద దాడులు జరుగుతున్నాయని పేపర్ల నిండా వార్తలు. మనవాళ్ళని కొట్టడాన్ని ‘కర్రీ బేషింగ్’ అని ఆస్ట్రేలియన్ క్రిమినల్సు ముద్దుగా పిలుచుకుంటున్నార్ట. ఆ మాట చదివితే నాకో సంఘటన గుర్తొచ్చింది.

నాలుగైదేళ్ళ కిందట ఒక జమైకన్ కుర్రాడితో నాకు కొద్దికాలం పరిచయం కలిగింది. అతను లండన్ లో ‘లా’ చదువుకుంటున్న విద్యార్థి. ఓసారి కబుర్లలో, ‘జమైకాలో భారతీయ సంతతి జనాభా ఎక్కువేనా?’ అని అడిగాను. ‘ఓ, కుప్పలు తెప్పలు. అక్కడ డాక్టర్లంతా వాళ్ళే’ అన్నాడు. అని, ‘వాళ్ళని మేము “కూలీలు” అని పిలుస్తాం’ అన్నాడు. నాకు ఒళ్ళు  మండిపోయింది.

‘కూలీలు అంటే అర్థం తెలుసా?’ అన్నాను. ‘ఓ, తెలుసు’ అన్నాడు. ‘వాళ్ళంతా కూల్ గా ఉంటారు. అందుకనే మేం కూలీలంటాం. (They are cool. That’s why we call them coolies)’ అన్నాడు. నేనింకేం మాట్లాడకుండా ఊరుకున్నాను.

‘సైంటిఫిక్ అండ్ మెడికల్ నెట్వర్కు వాళ్ళు స్పినోజా ‘పాన్ థీయిజం’ మీద లెక్చరు ఏర్పాటు చేస్తున్నారు. వెళ్దామా?’ అన్నాడు పెద్దాయన ఒకసారి. తప్పకుండా వెళ్దామని ఉత్సాహం చూపించాను. ఆ లెక్చరిచ్చేది ఎవరో అమెరికా నుంచి వచ్చిన యూనివర్శిటీ ప్రొఫెసర్ ట. వెళ్దామంటే వెళ్దామని అనుకున్నాం. ఆరోజు సాయంత్రం ఇంటినుంచి బయల్దేరి విక్టోరియా స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ ఒక కెఫె లో కూర్చుని నాకోసం ఎదురు చూస్తానన్నాడాయన. వెళ్ళేసరికి అప్పటికే కూర్చుని కాఫీ తాగుతూ ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అక్కణ్ణించి బయల్దేరి లెక్చరు హాలు ఉన్న పేటకి (నార్తు లండన్) వెళ్ళాం. ఇంకా టైము కాలేదని మళ్ళీ ఓ కప్పు కాఫీ తాగాం. తర్వాత లెక్చరు హాల్లోకి వెళ్ళాం. అప్పటికి చాలామందే జనాలు వచ్చారు. చిన్న హాలే. పెద్దాయన తనకి పరిచయస్తులైన ఓ నలుగురైదుగురు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశాడు. వాళ్ళలో ఒకాయన ఫిలాసఫీ లెక్చరరు. ఇంకొకావిడ ఎవరో గుర్తు లేదు. ఆవిడ తల్లి కూడా వచ్చింది, రిటైర్డు టీచరు. అక్కడ తినుబండారాలు, వైన్ గట్రా అన్నీ ఉన్నాయి. కొంచం పబ్బు/పార్టీ వాతావరణం లాగే ఉంది గానీ, ఫిలాసఫీ లెక్చరు వాతావరణం లేదు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాకా నెట్వర్కువాళ్ళకి డొనేషను ఇవ్వమని అభ్యర్థిస్తూ ఒకావిడ వచ్చింది. నేనో అయిదు రూపాయలు, ఆయనో అయిదు రూపాయలు సమర్పించుకున్నాం.

ఆర్గనైజర్ ఒకావిడ వైన్ గ్లాసు పుచ్చుకుని లేచి నిలబడింది. ప్రొఫెసర్ గారి పరిచయం చెప్పి, ‘నేనెరిగినంతలో చాలా స్పష్టమైన ఆలోచనలు కలిగిన, ఎంత క్లిష్టమైన విషయాన్నైనా స్పష్టంగా, సరళంగా వివరించగలిగిన వ్యక్తి మన ప్రొఫెసర్ గారు’ అని చెప్పి పొగిడింది. ప్రొఫెసర్ గారు లేచి నిలబడ్డాడు. లాప్ టాప్ తీశాడు. ప్రొజెక్టరు సరి చేస్తున్నాడు. ‘ఈ బోడి సరంజామా అంతా అవసరమా? ఇలాంటి లెక్చర్లు బ్లాక్ బోర్డు, చాక్పీసు కూడా అవసరం లేకుండా ప్రతిరోజూ ఇచ్చేదాన్ని నేను’ అని ఆ రిటైర్డు టీచరు నాదగ్గర గొణిగింది. లైట్లార్పేశారు. జనాలు కిక్కురుమనకుండా కూర్చున్నారు.

‘అసలీ ప్రొఫెసర్ గారు అమెరికా నుంచి వచ్చింది ఈ లెక్చరివ్వడానికేనా, లేకపోతే గర్ల్ ఫ్రెండుతో ఊరు చూడ్డానికొచ్చి ఖాళీగా ఉన్నటైములో మనకి లెక్చరిచ్చేస్తున్నాడా’ అని ఆలోచిస్తున్నాను నేను. ‘ఏదేమైనా అమెరికా వాడు. ఏదో యూనివర్శిటీలో ప్రొఫెసరు. అమ్మో, ఏం చెప్తాడో! అసలే చెప్పబోయేది స్పినోజా గురించి. పాన్ థీయిజం అంటే అంతా “మన” ఫిలాసఫీయే కదా. చూద్దాం ఏం చెప్తాడో’ అని పాపం కుతూహలపడిపోతోంది మనస్సు. ఇంతలో ప్రొఫెసర్ గారు పవర్ పాయింట్ స్లైడ్లు వేస్తూ ఉపన్యాసం మొదలెట్టాడు. మూడే ముక్కల్లో ఆ ఉపన్యాసం యొక్క సారాంశం ఇదీ -

‘దుష్ట మానవజాతి వల్ల భూగోళం వేడెక్కిపోతోంది. దీని గురించి ఏదో ఒకటి చెయ్యాలి. మతాలు – అనగా క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలు – ఈ విషయం గురించి మూసుక్కూర్చున్నై. “పాన్ థీయిజం” అనగా యావత్ప్రపంచాన్నీ దైవస్వరూపంగా భావించడం. ఆ సిద్ధాంతం నుండి మతబోధకులు – అనగా ఫాదరీలు, ముల్లాలు, రబై (rabbi)లు – స్ఫూర్తి పొంది, మానవజాతిని జాగృతం చేసి, భూగోళాన్ని చల్లబరచాలి.’

లెక్చరు ఒక పది నిమిషాలు గడిచేసరికే పరమ నాసిరకంగా ఉందని నాకు అర్థమైపోయింది. చుట్టూ కూర్చున్న ఇంగ్లీషోళ్లని గమనించడం మొదలెట్టాను. కత్తులు సానబెడుతున్న శబ్దం ఎక్కడో వినిపిస్తోంది. ‘లెక్చరు పూర్తవ్వనీరా నా సామిరంగా, అప్పుడొస్తుంది మజా’ అనుకున్నాను. లెక్చరయ్యాకా ‘శ్రోతల ప్రశ్నలు – ప్రొఫెసర్ గారి సమాధానాలు’ అన్న కార్యక్రమం కూడా ఉంది మరి.

ఇంకా లెక్చరు పూర్తి కానేలేదు. పెద్దాయన ధడాల్న లేచాడు. చర,చర తలుపు దగ్గరకి నడిచాడు. ‘నువ్వొస్తున్నావా, రావట్లేదా? ఈ దరిద్రపు లెక్చరు వింటూ ఇంకా ఎందుకక్కడ కూర్చున్నావ్?’ అని ఆయన చూపు నన్ను కసుర్తోంది. నేను గబగబా లేచి తలుపు దగ్గరకి నడిచాను. పెద్దాయన వెనకాల ఆయన స్నేహితులు ముగ్గురు లేచి నాతోపాటూ బయటకి వచ్చేశారు. మేము కోట్లేసుకుని బయటకి ఇంకా పూర్తిగా అడుగు పెట్టనేలేదు. పెద్దాయన సిగరెట్టు ముట్టించాడు. తిట్ల దండకం అందుకున్నాడు. ఇంక ఆ ప్రొఫెసర్ని తిట్టాడు చూడండీ, దాంతస్సాదియ్యా! లెక్చరు సంగతి దేవుడెరుగు, ఆ రోజు సాయంత్రం నాకు నిజమైన ఎంటర్టయిన్మెంటు ఆ తిట్లే.

ఆ ప్రొఫెసర్నీ, ఆయన పన్చేసే యూనివర్శిటీని, ఆ ప్రొఫెసర్ చేత లెక్చరిప్పించిన సైంటిఫిక్ అండ్ మెడికల్ నెట్వర్కు వాళ్ళనీ, ఆ ప్రొఫెసర్ని కన్న పాపానికి అమెరికా సంయుక్తరాష్ట్రాల్నీ కలిపి ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా, ఇంగ్లీషువాళ్ళు మాత్రమే ఉపయోగించే ప్రత్యేకమైన బూతుల్నీ, సాహిత్యకారుడిగా తాను సొంతంగా కనిపెట్టిన బూతుల్నీ ఉపయోగించి విచ్చలవిడిగా తిట్టి, తిట్టి వదిలిపెట్టాడు. ఫ్రాయిడ్ సిద్ధాంతాల్ని తిట్లుగా కూడా ఉపయోగించొచ్చని నాకు అనాడే తెలిసింది. ‘అసలిట్లాంటి ప్రొఫెసర్లని నేనెందుక్కన్నాను? కంటే కన్నాను, వాళ్ళకి ఫిలాసఫీ డిగ్రీలిచ్చి, అచ్చోసి ఈ ప్రపంచం మీదకి ఎందుకు వదిలిపెట్టేస్తున్నాను’ అని ఆ ప్రొఫెసర్ గారి మాతృభూమి సిగ్గుతో కుమిలిపోయేలా కడిగిపారేశాడు.

అమెరికాలో విద్యాప్రమాణాలు ఎంత ఘోరంగా తయారయ్యాయో, ‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్టు’ ఇట్లాంటి ప్రొఫెసర్లు దేశాలమీద పడి యూనివర్శిటీల్ని ఎల్లా భ్రష్టు పట్టించేస్తున్నారో వర్ణించి, వర్ణించి తిట్టాడు. మేం అయిదుగురం కలిసి ఒకే కార్లో వెళ్ళాం. ఇంటికి వెడుతున్నంతసేపూ తిడుతూనే ఉన్నాడు. ఆయన ఫ్రెండ్సంతా కూడా వంత పాడుతూ తెగ తిడుతూనే ఉన్నారు. ‘మనం ఇద్దరం కలిసి ఈ బోడి లెక్చరు కోసం పది రూపాయలు వదుల్చుకున్నాం’ అని ఆయన నా దగ్గర చాలా విచారించాడు. అసలిట్లాంటి నాసిరకం లెక్చరుకి నన్ను తీసుకెళ్ళినందుకు తెగ బాధపడిపోయాడు.

మొత్తానికి ఇంటికెళ్ళి నవ్వుకుంటూ పడుకున్నాను. మర్నాడే ఈమెయిల్ చేశాడు, అలాంటి లెక్చరుకి నన్ను తీసుకెళ్ళినందుకు మళ్ళీ సారీ చెప్తూ. అంతేకాదు, ఆ రోజు రాత్రే సైంటిఫిక్ అండ్ మెడికల్ నెట్వర్కు వాళ్ళకి ఘాటైన పదజాలంతో మెయిల్ చేశాట్ట. ‘మీ ప్రమాణాలు ఘోరంగా తయారయ్యాయి, ఇట్లాంటి సజ్జునా లెక్చర్లివ్వడానికి తీసుకొచ్చేది?’ అని నెట్వర్కువాళ్ళని కడిగిపారేశాట్ట. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుసుకున్నప్పుడు, ‘లండన్ లో ఊరికి ఉత్తరాన ఉండేవాళ్ళందరూ ఆ ప్రొఫెసర్ గారి లెక్చరు విని ఆనందించగలిగే పిచ్చోళ్ళని, ఊరికి దక్షిణాన మాత్రమే మనలాంటి ఆలోచనాపరులూ, బుద్దిమంతులూ ఉంటారనీ’ జోకులేశాడు.

మొత్తానికి అదీ ‘పాన్ థీయిజం’ గురించిన లెక్చరు కథ. తర్వాత కాలంలో ఇంతకన్నా నాసిరకం లెక్చర్లు ఒకట్రెండు విన్నప్పటికీ (ఫ్రీగానే లెండి, నాసిరకం లెక్చర్లకోసం తర్వాతెప్పుడూ డబ్బులు ఇవ్వలేదు), ఇంగ్లండులో ఈ ‘మొదటి అనుభవం’ మాత్రం గుర్తుండిపోయింది.

కొద్ది వారాలు గడిచాకా ఆ పెద్దాయన్ని మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళి కలుసుకున్నాను. ఇహ అక్కడినించీ మా ఇద్దరికీ ఫిలాసఫీ కబుర్లు మాత్రమే నడిచేవి. ఆయన అప్పుడు ఇంకో నవల రాస్తున్నాడు. దాని డ్రాఫ్టులో కొన్ని భాగాలు నాకు చూపించాడు. ఒక చాప్టర్లో మూడు పాత్రల మధ్య సంభాషణ నడుస్తుంది. ఆ పాత్రల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. కొంచం చదివాకా నాకు అర్థమైంది. ముగ్గురు ఫిలాసఫర్లని (వాళ్ళలో అరిస్టాటిల్ ఒకడు, మిగతావాళ్ళు గుర్తు లేరు) ఆ చాప్టర్లో కేరెక్టర్లుగా తీసుకొచ్చి వాళ్ళ చేత సంభాషణ చేయించాడు. వాళ్ళ పేర్లు కూడా ఆ ఫిలాసఫర్ల పేర్లు ధ్వనించేలాగా పెట్టాడు. నేనా చాప్టరు  కొంచం చదివి, ‘ఇది ఫిలాసఫర్ల సంభాషణ కదూ, వీళ్ళు ఫలానావాళ్ళు కదూ’ అంటే, ‘భలే కనిపెట్టేశావే’ అన్నాడు. (నేను చదివిన ముందు నవల్లో కూడా ఒక చాప్టరు అంతర్లీనంగా ఫిలాసఫీకి కేటాయించాడు. అందులో టాక్సీ అంటే కాలం అనీ, కోతి అంటే మరేదో అనీ అర్థం చేసుకోవాలిట. ఆ అంతరార్థాలన్నీ ఆయనే చెప్పాడనుకోండి.) మరొక సంభాషణలో, ‘విట్జెన్ స్టయిన్ తమ్ముడికి ఒక చెయ్యి పోయినా పియానో వాయించడంలో గొప్ప కళాకారుడయ్యాట్ట కదా’ అన్నాను. ‘ఒకే ఒక్క పుస్తకం చదివి చాలా సమాచారం గుర్తు పెట్టుకున్నావే’ అన్నాడాయన.

ఆయన కూడా ఇమ్మాన్యువల్ కాంట్ ని అందరికన్నా ఎక్కువ అభిమానిస్తానని చెప్పాడు. ఆయన ఒకప్పుడు గాఢమైన ఆధ్యాత్మికాభిలాష కలిగిన వ్యక్తి. తన చిన్నతనంలో  పురాతన పాశ్చాత్య ఆధ్యాత్మిక సిద్ధాంతాల్లోనూ, సాధనలోనూ మునిగితేలానని చెప్పాడు. నాకింతవరకు తారసపడ్డ వ్యక్తుల్లో ఎవరి జీవితాల్లోనూ లేని అనేక విచిత్ర సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. (అవన్నీ బ్లాగులో రాయడం కుదరదనుకోండి). అయినప్పటికీ కారణాలు తెలియదు కానీ, నాకు పరిచయమైన ఆ వయసులో మాత్రం ఆయన పూర్తిగా భౌతికవాది. (అప్పుడు ఆయన వయసు యాభైకి పైబడి ఉండవచ్చు). సైన్సు, హేతువాదం సహాయంతో ‘మూఢ’ విశ్వాసాల్ని ఖండిస్తూ రచనలు చేస్తున్న యోధుడు.

కాంట్, షోపన్ హోవర్ ల సిద్ధాంతాల మీద భారతీయ తత్త్వశాస్త్రాల ప్రభావం గురించి నేను ఆశ్చర్య పడ్డ సంగతి ఆయనతో చెప్పాను. కాంట్ ఫిలాసఫీ గొప్పతనం గురించి నాకు చెప్తూ ఆయన వాత్సల్యంతో, ‘అసలీ ఫిలాసఫీల జోలికి పోవడం అనవసరం’ అని నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడు. ఏమనేవాడంటే, ‘మురళీ, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏదో ఉన్నదనీ, స్విచ్ వేస్తే లైటు వెలిగినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా సత్యదర్శనం అవుతుందనీ నేను ఆశ పడేవాణ్ణి. అదంతా భ్రమ. కాంట్ ఫిలాసఫీ తార్కికంగా ఏం నిరూపిస్తోందంటే- ఇంద్రియాతీతమైన సత్యం ఒకటి ఉన్నది, కానీ దాన్ని ఇంద్రియాల సహాయంతో తెలుసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు అని. కాబట్టి మనమెరుగని సత్యం ఒకటి ఉన్నమాట నిజమే కానీ, దాన్ని ఎప్పటికీ మనం తెలుసుకోలేము. తెలుసుకోవాలని తపన చెందడం వ్యర్థం. “నన్ను నేను తెలుసుకోవాలి” – ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళకీ, మనలాగా ఫిలాసఫీ కబుర్లు చెప్పుకునేవాళ్ళకీ నిజంగా ఏం కావాలో తెలుసునా? సైకోథెరపీ!’.

ఈ మాటల్ని బట్టి ఆయన కొంత వరకూ ఒక ‘సినిక్’ అని మీకు అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఇంకా ఏమనేవాడంటే, ‘చూడు. ఇంద్రియాలు బాహ్యవస్తువుల్ని ప్రతిబింబించగలవు మాత్రమే. అవి తమను తాము ఎలా తెలుసుకోగలవు? కన్ను తనను తాను చూడగలదా? చెవి తనను తాను వినగలదా? నాలిక తన్ను తాను రుచి చూడగలదా? అలాగే కాన్షస్ నెస్ (ప్రజ్ఞ) కూడా తనను తాను తెలుసుకోవడం అసాధ్యం. కాన్షస్ నెస్ గురించి మాట్లాడేవాళ్ళూ, పరిశోధనలు చేసేవాళ్ళూ, ఉపన్యాసాలిచ్చేవాళ్ళూ పిచ్చివాళ్ళు’ అనేవాడు. అన్నట్టు ఆయన జిడ్డు కృష్ణమూర్తిగారి లెక్చర్లకు కూడా వెళ్ళాట్ట. కానీ వాటివల్ల ఏమీ ప్రభావితుడు కాలేదు.

అంతే కాకుండా ఆయన నాకు ‘జీవిత పరమార్థం – సత్యాన్వేషణ’ మొదలైన వ్యర్థ జిజ్ఞాసలన్నీ వదిలేసుకుని చేతనైనంతమేరకు డబ్బు సంపాదించుకుని సుఖంగా జీవితం గడపడం ఉత్తమమని కూడా ఉపదేశిస్తూ ఉండేవాడు. ఆయన కాంట్ ఫిలాసఫీ గురించి చెప్పిన మాటలు మాత్రం నన్ను బాగానే ఆలోచింపజేసేవి. ఆధ్యాత్మిక చింతనకి పూర్తి విరుద్ధంగా ఒక పజిల్ లాగా అనిపించే  ఆ మాటల్ని బద్దలు కొట్టడానికి నేను సొంతంగా ప్రయత్నిస్తూ ఆలోచించేవాణ్ణి. అదే క్రమంలో అప్పట్లో ‘త్రిపురా రహస్యం’ అనే ఒక అద్వైత గ్రంధాన్ని చదివాను. దాని మీద చాలా బుర్ర బద్దలుగొట్టుకోవాల్సి వచ్చింది. అది చదువుతుంటే కాంట్ ఫిలాసఫీకి విరుగుడు దొరికినట్టనిపించింది. కానీ ఈ ఫిలాసఫీల్తో వచ్చిన చిక్కేమిటంటే, చదువుతున్నంతసేపూ అర్థమైనట్టే ఉంటాయి. పుస్తకం మూసెయ్యగానే బుర్రలో ఏం మిగిలినట్టు అనిపించదు. మళ్ళీ పుస్తకం తీసి చదివితేనే గుర్తు వస్తాయి. పదే పదే మననం చేసుకుంటేగానీ బుర్రలో నిలబడవు.

ఈ విధంగా పాశ్చాత్య తత్త్వశాస్త్రంలోని సిద్ధాంతాల గురించి కొంత తెలుసుకున్నా అవేవీ పెద్దగా నన్ను ప్రభావితం చెయ్యలేకపోయాయి. భౌతికవాదం నాకు అర్థం కాలేదు. ‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి’ అనీ, ‘ఏకాన్త విధ్వంసిషు మద్విధానాం, పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు’ అనీ అనుకునే నన్ను భూమ్మీద పడేసింది మాత్రం ఒక సైన్సు పుస్తకం. దాని గురించి వచ్చే టపాలో.

కొన్నాళ్ళు గడిచాకా లైబ్రరీలో ఆయన చెప్పిన పుస్తకం కోసం వెతికాను. దొరికింది. ఆ పుస్తకం బ్రయన్ మేగీ (Bryan Magee) రాసిన ‘ది స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ’. మన ‘విశ్వదర్శనం’ లాంటి పుస్తకమే. కానీ ఎంత గొప్ప క్వాలిటీ ప్రింటు! అందమైన పెయింటింగులు, ఫొటోలతో ఆకర్షణీయమైన పెద్ద పుస్తకం. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతి రోజూ శ్రద్ధగా చదివేవాణ్ణి. అప్పట్లో బ్రహ్మచారి జీవితం భలే ఉండేది లెండి. ఆఫీసు, పుస్తకాలు తప్ప వేరే వ్యాపకం ఏమీ ఉండేది కాదు. సాయంత్రం ఇంటికి రాగానే పుస్తకం పట్టుకు కూచోడం, రాత్రి బాగా పొద్దుపోయేదాకా చదువుకుంటూనే గడిపెయ్యడం. మధ్యలో ఎప్పుడో ఓ రెండు మెతుకులు తినేవాణ్ణి.

నాతో ఇదివరకు ఒకసారి, ‘అసలు ఫిలాసఫీ ఎందుకు చదవాలి, ఏమొస్తుంది చదివితే?’ అన్నాడు ఒక మిత్రుడు. నేనన్నాను, ‘ఏదో వస్తుంది అని కాదు ఫిలాసఫీ చదివేది. మనందరికీ అన్ని విషయాల గురించీ ఏవో కొన్ని అభిప్రాయాలూ, ఊహలూ ఉంటాయి. ఫిలాసఫీ చదివితే మనకన్నా చాలా గొప్పవాళ్ళు ఎంతోమంది మనకన్నా బాగా, శాస్త్రీయంగా ఇటువంటి ఊహలే చేశారని తెలుస్తుంది. అంతే కాదు, ఆయా ఊహలకి ‘సిద్ధాంతాలు’ అనే పేర్లు (బ్రాండ్లు) ఉన్నాయని కూడా తెలుస్తుంది. వాటి గురించి తెలుసుకుంటే మనకి వచ్చేది స్పష్టత. కొత్తగా వేరేవాళ్ల వంటిట్లో వంట చెయ్యడానికి పూనుకున్నామనుకో. ఏ డబ్బాలో ఏం ఉందో తెలియక అన్నీ వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అన్ని డబ్బాల మీద లేబుల్సు అంటించి ఉంటే ఏది ఎక్కడ ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఫిలాసఫీ చదివితే కూడా వచ్చేది అలాంటి స్పష్టతే. ఫలానా ఊహో, అభిప్రాయమో ఫలానా సిద్ధాంతంలోకి వస్తుంది అని తెలుస్తుంది’ అన్నాను. బ్రయన్ మేగీ రాసిన పుస్తకం చదువుతున్నప్పుడు నాకు కలిగిన అభిప్రాయం/అనుభూతి సరిగ్గా అదే. ‘ఓహో, ఇది ఇదన్నమాట’ అని తెలుసుకున్న ఫీలింగు. గొప్ప ఉత్సాహం.

మన నండూరి రామ్మోహన్రావు గారి లాగే బ్రయన్ మేగీ కూడా చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే ఒక్కొక్క తత్త్వవేత్త జీవితాన్నీ వివరంగా మొదట పరిచయం చెయ్యడం, ఆ తర్వాతే ఆ తత్త్వవేత్త చెప్పిన విషయాలు పరిచయం చెయ్యడం. పాశ్చాత్య తత్త్వవేత్తల గురించి తెలుసుకున్నాకా తత్త్వవేత్తలంటే ఏదో ‘ఉన్నతులు’ అన్నభావం తొలగిపోయి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళలో కొందరు కరడు గట్టిన నిరాశావాదులు, కొందరు పిచ్చికుక్కల వంటివారు (ఈ మాట అన్నందుకు పాఠకులు క్షమించాలి!!). కొందరు చాలా మహానుభావులు. కొంతమంది మనకి ఎంతో ఆత్మీయులనిపిస్తారు.

వాళ్ళలో ‘స్పినోజా’ గురించి చదివితే ఆయన పరమ భాగవతోత్తముడని (ఈ పదం మీకు నచ్చకపోతే నేనేమీ చెయ్యలేను) నాకు అనిపించింది. ఆయన చెప్పిన ‘పాన్ థీయిజం’ మన భాగవతంలో చెప్పిన సర్వాంతర్యామి సాధనకి దగ్గరగా అనిపించింది. స్పినోజా నాకు నచ్చాడు. (ఆయన పాశ్చాత్య తత్త్వవేత్తలందరిలోకీ చాలా ప్రేమాస్పదుడని బెర్ట్రండ్ రసెల్ అన్నాడని నండూరి రామ్మోహనరావు గారు రాశారు). అయితే ఫిలాసఫీలన్నిటిలోకీ నాకు నచ్చినది ఇమ్మాన్యువల్ కాంట్ ఫిలాసఫీ. కానీ, ఒక వ్యక్తిగా మాత్రం నాకు అందరికన్నా బాగా నచ్చినది విట్జెన్ స్టయిన్.

‘విశ్వదర్శనం – పాశ్చాత్య చింతన’ లో రెండు పెద్ద లోపాలు ఉన్నాయని నా అభిప్రాయం. ఒకటి, విట్జెన్ స్టయిన్ జీవితాన్ని పరిచయం చెయ్యకపోవడం. దానికి రచయిత ముందుమాటలో క్షమాపణ చెప్పుకున్నాడు. విట్జెన్ స్టయిన్ ఫిలాసఫీ అర్థం కావడం కష్టం. నాకూ ఏమీ అర్థం కాలేదు. అయినా ఒక వ్యక్తిగా ఆయన గురించి తెలుసుకోకపోతే, పాశ్చాత్య తత్త్వశాస్త్రం గురించి తెలుసుకున్నట్టు కాదని నా నిశ్చితాభిప్రాయం. నేనే కనక విశ్వదర్శనం పుస్తకాలు రాసి ఉంటే, విట్జెన్ స్టయిన్ ఫిలాసఫీ గురించి పరిచయం చెయ్యకుండా వదిలేసినా, కనీసం ఆయన జీవితం గురించి మాత్రం పరిచయం చేసి తీరేవాణ్ణి. అంత గొప్ప వ్యక్తి ఆయన. పాశ్చాత్య తత్త్వవేత్తల్లో ఆయన కన్నా గొప్పవాడు మరి లేడని చాలామంది అభిప్రాయపడతారు.

ఇక ‘విశ్వదర్శనం’ లోని రెండవలోపం, కార్ల్ పాపర్ ‘ఫిలాసఫీ ఆఫ్ సైన్స్’ని పరిచయం చెయ్యకపోవడం. సైన్సు ఏ పునాదుల మీద పనిచేస్తుందో అవగాహన చేసుకోకపోతే ఆధునిక తత్త్వశాస్త్రంలో మిగతా ఏం తెలుసుకున్నా ఉపయోగం లేదని నాకో అభిప్రాయం.

అప్పట్లో ఈ ఫిలాసఫర్లందరూ నా బుర్రలోకి ఎంతగా దూరిపోయారంటే, నేను ఆఫీసులో సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు టెస్టు డేటాలో మనుషుల పేర్లు రాయాల్సి వచ్చినప్పుడు ‘ఇమ్మాన్యువల్ కాంట్, షోపన్ హోవర్, జాన్ లాక్’ ఇలాంటి పేర్లు రాసేవాణ్ణి. వాళ్ళెవరి గురించీ మా మొగుడికి తెలియకపోవడం వల్ల సాఫ్ట్ వేర్ స్క్రీన్ల మీద ఈ పేర్లు చూసి, ‘మురళీ, ఎక్కడ పట్టావయ్యా ఈ విచిత్రమైన పేర్లన్నీ’ అనేవాడు. నేను నవ్వేసి ఊరుకునేవాణ్ణి.

(ఇంకా ఉంది.)

బ్లాగాడిస్తా రవి గారు చదవమని సలహా ఇస్తే నండూరి రామ్మోహనరావు గారు రాసిన విశ్వదర్శనం పుస్తకాలు కొన్నాను. అందులో ‘భారతీయ చింతన’ మొదట చదవాలని మొదలుపెట్టి శరవేగంతో పూర్తి చేసేశాను. ప్రయాణాల్లో పుస్తకాలు చదవడం నాకు అలవాటు. గత నెల పదహారో తారీకున గవర్నమెంటాఫీసులో ఒక పని తగిలింది. ప్రయాణాల్లోనే కాకుండా హాస్పిటళ్ళలోనూ, ఇలా గవర్నెమెంటాఫీసుల్లో జిడ్డు పన్లు తగిలినప్పుడూ ఓ పుస్తకం మొత్తం చదివెయ్యడానికి అవకాశం దొరికిందిరా అనుకుంటాను. వెయిటింగ్ టైములో పుస్తకంలో తలదూర్చి పరిసరాలు మర్చిపోతా (పర్సూ, బ్యాగ్గూ లాంటివి గట్టిగా పట్టుకునే అనుకోండి). ఆ విధంగా భారతీయ చింతనలో సగభాగం ఒక్కరోజులోనే పూర్తయ్యిపోయింది. తర్వాత పాశ్చాత్య చింతన చదవాలి. ఇదివరకే ఇలాంటి పుస్తకం ఇంగ్లీషులో చదివేశాం గదా అని దాన్ని కొంచం అలక్ష్యం చేసి మెల్లిగా అప్పుడు కొంతా, ఇప్పుడు కొంతా చదువుతూ ఉండగా…మొన్న పూర్తయిపోయింది. ‘విశ్వదర్శనం’ పుస్తకాలు నాకు చాలా నచ్చాయి. వాటి గురించి వేరేగా బ్లాగుతా కానీ, ఈ ‘పాశ్చాత్య చింతన’ మాత్రం చదువుతున్నంతసేపూ కొన్ని గాఢమైన జ్ఞాపకాలు రేకెత్తిస్తూనే ఉంది.

నా పుట్టి పెరిగిన వాతావరణం, స్వభావం రీత్యా ఆధ్యాత్మిక చింతనతో నాకు పరిచయం ఎక్కువ (అదే తత్త్వశాస్త్రం అన్న భ్రమ కూడా ఉండేది.) లండన్ లో కాలు పెట్టిన తర్వాత పాశ్చాత్య జ్యోతిషానికి సంబంధించి కొంత కృషి చెయ్యడం ప్రారంభించాను. అందులో భాగంగా ఒక మిత్రుడు ఒక పెద్దాయనకి నన్ను పరిచయం చేసి ఆయన్ని వెళ్ళి కలవమన్నాడు. ఓ శనివారం వెళ్ళి కలిసాను. రైల్వే స్టేషన్ కి ఆయన వద్దన్నా వచ్చి కారులో ఇంటికి తీసుకెళ్ళాడు. నా గురించి మా మిత్రుడు ఏం చెప్పాడో నాకు తెలియదు గానీ, నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేకుండానే ఆయన ఎన్నో సంగతులు చెప్పుకుంటూ పోయాడు. వాళ్ళావిడ కూడా ఆప్యాయంగా పలకరించింది. ఆ చక్కటి వేసవి సాయంత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

చాలా కబుర్లు నడిచిన తర్వాత జ్యోతిషం ఎలా పని చేస్తుంది అన్న ప్రశ్న గురించి మాట్లాడుకున్నాం. ఆ విషయం గురించి నేను ఎంతో కాలంగా అల్లుకుంటూ వచ్చిన కొన్ని ఊహల్ని ఆయనకి వివరించాను. ఆయన శ్రద్ధగా విన్నాడు. విని, ‘నువ్వు చెప్పినదంతా ఏమిటో తెలుసా?’ అన్నాడు. ఏమిటన్నాను. ‘ప్లేటో ఫిలాసఫీ. దానితో నీకు పరిచయం ఉందా?’ అన్నాడు.

జ్యోతిషానికీ ప్లేటో ఫిలాసఫీకి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోకండి. అసలు నేనేం మాట్లాడానని కూడా అడక్కండి. అప్పుడు నేనేం చెప్పానో ఇప్పటికీ నాకు కొంత అస్పష్టంగా గుర్తు ఉంది. ‘ఆ ఊహలు ఎంత విచిత్రంగా ఉండేవో కదా, అప్పుడు నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో కదా’ అని కూడా ఇప్పుడు కొద్దిగా అనిపిస్తూ ఉంటుందనుకోండి. అయినా అప్పుడు మాత్రం, ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అని నా ఐడియాలన్నీ ఆయనకి చెప్పాను. ఓపిగ్గా అంతా విన్నాకా ఆయన, ‘ప్లేటో ఫిలాసఫీ నీకు తెలుసా?’ అని అడిగితే తెల్లమొహం వేశాను. అప్పుడాయన ప్లేటో ఫిలాసఫీ గురించి నాకు కొద్దిగా చెప్పడానికి ప్రయత్నించాడు. తన ఒళ్ళో గారంగా కూర్చున్న పిల్లిని చూపించి, ‘ఈ పిల్లి ఉంది కదా, ఇది భౌతికమైనది. భావమయ ప్రపంచంలో పిల్లులన్నిటికీ మూలమైన ఒక పిల్లి భావం ఉంటుందన్నమాట’ అని మొదలుపెట్టాడు. నేను వెంటనే, ‘ఆర్కిటైపు గురించా మీరు మాట్లాడుతున్నది?’ అన్నాను. ఆయన ఆశ్చర్యపడ్డాడు. తర్వాత పాశ్చాత్య తత్త్వశాస్త్రం గురించీ, అందులో ప్లేటో ఫిలాసఫీ గురించీ కొద్దిగా చెప్పాడు. ‘నాకు పాశ్చాత్య తత్త్వశాస్త్రం గురించి కొంచం తెలుసుకోవాలని ఉంది, ఏమైనా పుస్తకాలు సూచించండి’ అని అడిగాను. ఆయన వెంటనే కాగితం మీద రాసి ఇచ్చాడు.

ఇంతకీ ఆ సాయంత్రం మాకిద్దరికీ అనిపించింది ఏమిటంటే, జ్యోతిషం విషయంలో మా ఇద్దరి భావాలూ అస్సలు కలవ్వు. అయితే ఆయన జ్యోతిషంలోనే కాక, తత్త్వశాస్త్రంలో కూడా చాలా నిష్ణాతుడు. కాబట్టి తత్త్వశాస్త్ర విషయకంగా మా ఇద్దరికీ స్నేహం కుదురుతుందని అనిపించింది. మా సంభాషణ పూర్తయ్యాకా వాళ్ళింట్లోనే భోజనం చేశాను. వాళ్ళావిడ నాకోసం వెజిటేరియన్ మీల్ ఒకటి కొనుక్కుని వచ్చింది. నేను సెలవు తీసుకోబోయేముందు ఆయన కొద్ది వారాల క్రితమే పబ్లిష్ అయిన తన నవల ఒకటి నాకు బహుమతిగా సంతకం చేసి ఇచ్చాడు.

నేను ఇంటికి బయల్దేరాను. అప్పటికే బాగా ఆలస్యమైంది. తిరుగు ప్రయాణానికి రైల్లో కాకుండా బస్ లో వెళ్తానన్నాను. ఇప్పటికీ బాగా గుర్తు. అది 2002వ సంవత్సరం. వరల్డ్ కప్ ఫుట్ బాల్ మాచ్ లు జరుగుతున్నాయి. ఆ రోజు సాయంత్రం డెన్మార్క్ పైన ఇంగ్లండు గెలిచింది. నన్ను ఆయన బస్ స్టాపు దగ్గర కారులో దిగబెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంగ్లండు ఫుట్ బాల్ ఫాన్సు సంబరం చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. ఒకాయన ఆనందంతో బట్టలు విప్పేసి మరీ గంతులేస్తున్నాడు. భయం భయంగా ఎలాగో బస్సెక్కి ఇంటికి చేరాను.

Posted by: nagamurali | March 8, 2009

ఆదివారం తలంటు

చాలాకాలం తర్వాత ఈ ఆదివారం తలంటు పోయించుకోవాలనిపించింది. అందుకే పుస్తకం.నెట్ లో ఒక పుస్తకం గురించి నా అభిప్రాయం రాశాను.

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

Older Posts »

Categories