(చిన్నప్పుడు బాలజ్యోతిలో చదివిన మహీధర నళినీమోహన్ గారి కథ ఆధారంగా.)
అనగా అనగా ఒక మహా పండితుడు. ఆయనకొక పుత్రుడు. అతను అక్షరాలా పండిత పుత్రుడు. పేరు మల్లినాథుడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తండ్రి గారాబంగా పెంచాడు. దాంతో మల్లినాథుడు చదువుకి మొండికేసి అక్షరమ్ముక్క కూడా నేర్చుకోకుండా అల్లరి చిల్లరగా పెరిగాడు. పెళ్ళీడు వచ్చింది. వేరే ఊరిలోని పండిత కుటుంబంలోని పిల్లని తెచ్చి పెళ్ళి చేశారు. తండ్రిగారి కీర్తి తప్ప కుమారుడి ప్రతిభ గురించి తెలియక ఆ పిల్ల కుటుంబం పెళ్ళికి ఒప్పుకుంది. మధ్యలో మసిపూసి మారేడుకాయ చేసే పేరయ్యలు ఉండనే ఉంటారుగా.
పెళ్ళి తంతులు పూర్తయ్యాకా అత్తవారి ఇంటికి వెళ్ళాడు మల్లినాథుడు. వెళ్ళే ముందే కొడుక్కి కొన్నిజాగ్రత్తలు చెప్పాడు తండ్రి. ‘ఒరే అబ్బాయీ, మీ మామగారూ, బావ మరుదులూ అంతా మంచి పండితులు. నువ్వు వెళ్ళగానే వాళ్ళ గ్రంథాలూ అవీ చూపించి గోష్టి మొదలుపెడతారు. సాధ్యమైనంతవరకూ తప్పించుకో. ఏదైనా పుస్తకం చూపిస్తే, “గ్రంథకర్త ఎవరూ? ఈ భాష్యకారుడితో మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి”, ఇలా ఏదో దబాయించు సుమా’ అని సలహా ఇచ్చాడు.
మనవాడికి అత్తవారి ఇంటిలో రాచమర్యాదలు జరుగుతున్నాయి. అంత పెద్ద పండితుడి కొడుకు వచ్చాడని ఊరు ఊరంతా వచ్చి చూసి వెడుతోంది. మల్లినాథుడి భార్యకి గర్వంగా ఉంది. మల్లినాథుడు ఏవో పనులు కల్పించుకుని చర్చాగోష్టుల ప్రసక్తి రానియ్యకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సాప్ట్ వేర్ ఇంజనీరుకి పెళ్ళయి, సాప్ట్ వేర్లో పని చేస్తున్న బావమరుదులు ఉంటే ఊరుకుంటారా? ‘బావా, జావా’ అంటూ ఏవో కబుర్లు మొదలుపెట్టరూ! అలాగే మల్లినాథుణ్ణి కూడా బలవంతాన అతని బావమరుదులు వాళ్ళ పుస్తకాల గదిలోకి లాక్కెళ్ళి వాళ్ళ పుస్తకాలు అన్నీ చూపిస్తున్నారు. మనవాడు, ‘ఇలాంటి చచ్చు పుస్తకాలు మేం చాలా చూశాం లేమ్మా’ అన్నట్టుగా పోజిచ్చి ఏదో దబాయిస్తున్నాడు. వాళ్ళావిడ కూడా సరదాపడి వచ్చి అక్కడే కూర్చుని అంతా వింటోంది.
మల్లినాథుడు వాళ్ళ అలమారులో ఏదో దుక్కలాటి పుస్తకం కనపడితే దాన్ని తీసి, ‘ఇది ఏ గ్రంథం?’ అని అడిగాడు. ‘అది అలిఖితం’ అన్నారు బావమరుదులు. ‘అలాగా, ఎవరు రాశారు?’ అన్నాడు. వాళ్ళు గొల్లున నవ్వారు. ఇతనికి ఏమీ తెలియదని వాళ్ళకీ, అతని భార్యకీ అనుమానం వచ్చింది.
మర్నాడు పొద్దున్న అతని మామగారు పిలిచి, ‘నాయనా, పూజకి వేళవుతోంది. ఏమైనా పూలు తీసుకురా’ అని పంపించారు. (నేనైతే, ‘అల్లుడికి పని చెప్పడమేమిటండీ, ఠాట్’ అని ఎగిరేసి సైలెంటుగా ఇంటికొచ్చేద్దును.) పాపం ఆ వెర్రివాడు ఊళ్ళోకి పోయి ఎదురుగా ఎర్రటి పూల చెట్టు ఒకటి కనబడితే, దాన్ని ఎక్కి బోలెడన్ని పూలు కోసుకుని తీసుకువచ్చాడు. తీరా చూస్తే అవి మోదుగ చెట్టు పూలు. పూజలకి పనికిరావు. బావగారి నిర్వాకం చూసి బావమరుదులు పడీ, పడీ నవ్వారు. మామగారు తెల్లబోయాడు.
అప్పుడు మల్లినాథుడి భార్య (ఆవిడ కూడా మంచి జావా ప్రోగ్రామరే) మొగుణ్ణి చూసి ఒక శ్లోకం చెప్పిందిట.
రూప యౌవన సంపన్నం
గుణ శీల సమన్వితం
విద్యాహీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా||
ఒక మనిషి మంచి అందగాడు కావచ్చు, వయసులో ఉండి ఉండవచ్చు. మంచి గుణాలూ, సత్ప్రవర్తనా కూడా ఉండవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ అతనికి జావా రాకపోతే ఆ గుణాలేమీ శోభించవు- మోదుగ చెట్టు పువ్వుల్లాగా. (మోదుగ చెట్టు పూలు కూడా ఎర్రగా బాగుంటాయి, కానీ వాసన ఉండదుట.)
దాంతో మల్లినాథుడికి అహం దెబ్బతింది. వెంటనే అదే క్షణంలో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళడం, వెళ్ళడం నవద్వీపం వెళ్ళిపోయాడు. పన్నెండేళ్ళు ఇల్లూ, ఒళ్ళూ మర్చిపోయి కఠోర శ్రమ చేసి మహా సంస్కృత పండితుడయ్యాడు. గెడ్డాలు పెరిగిపోయి సన్యాసి రూపం వచ్చింది. చదువు పూర్తయ్యాకా మళ్ళీ అత్తవారి ఊరు వెళ్ళాడు. తిన్నగా అత్తవారి ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు.
ఎవరో మహా తేజస్వి మన ఇంటికి పిలకుండానే వచ్చాడని సంబరపడి అతని అత్తా, మామగారూ ఇంట్లోకి రమ్మని సపర్యలు చేసి భోజనానికి కూర్చోమన్నారు. అతని భార్యే వడ్డన మొదలు పెట్టింది. పాపం శోకం మూర్తీభవించినట్టుగా ఉందామె. పరధ్యానంగా ఉంది. చారు వడ్డించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు మల్లినాథుడు. వెంటనే ఒక శ్లోకం చెప్పాడు -
చారు చారు సమాయుక్తం
హింగు జీర సమన్వితం
లవణ హీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా ||
‘చారు చాలా అందంగా ఇంగువ, జీలకర్రలతో కలిపి చెయ్యబడింది. కానీ ఉప్పు లేకుండా అవేవీ శోభించవు – మోదుగచెట్టు పువ్వుల్లాగే’ అని ఆ శ్లోకానికి అర్థం. మల్లినాథుడి భార్యకి దిమ్మతిరిగింది. తేరిపార చూసి, గెడ్డం వెనకాల ఉన్నది తన భర్తే అని గ్రహించింది. ఆవిడ ఆనందానికి అవధుల్లేవు.
మల్లినాథుడు మన తెలుగువాడే. సంస్కృత మహాకావ్యాలకి ఆయన రాసిన వ్యాఖ్యలు జగత్ప్రసిద్ధాలు. ‘మాఘే, మేఘే గతం వయ:’ అని ఆయన చెప్పుకున్నాడుట. అంటే, మాఘ కావ్యానికీ, మేఘ కావ్యానికీ (మాఘుడు రాసిన శిశుపాలవధకీ, కాళిదాసు రాసిన మేఘసందేశానికీ) వ్యాఖ్య రాయడంలో తన వయస్సు అంతా అయిపోయిందని దాని భావం.
(కోలాచల మల్లినాథ సూరి వంశంలో పుట్టిన ఒకాయన్ని నా అదృష్టం కొద్దీ కలుసుకోగలిగాను. ఆయనా గొప్ప పండితుడే. తెలుగు భాషా, సాహిత్యాల్లో అంతర్జాలంలో ఆయన చేస్తున్న కృషి అందరికీ తెలిసినదే.)